'దిశ' ఫెయిల్.. 'శక్తి' సక్సెస్: అనిత

  • ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందన్న అనిత
  • గత ప్రభుత్వ హయాంలో దిశ చట్టం అమలు కాలేదని విమర్శ
  • ఇప్పటి వరకు 2,366 గంజాయి కేసులు నమోదు చేశామని వెల్లడి

ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలంటే అక్కడ శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ పోలీసింగ్ తీరుపై ఆమె పూర్తి స్థాయి రిపోర్ట్ కార్డ్‌ను బయటపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 'దిశ' చట్టం అమలు కాలేదని విమర్శిస్తూ.. తమ హయాంలో క్రైం రేట్ గణనీయంగా తగ్గిందని లెక్కలతో సహా వివరించారు.


ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గిందని హోంమంత్రి వెల్లడించారు. సీసీటీవీలు, డ్రోన్ టెక్నాలజీ వాడకం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాల టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటికే 70 శాతం పూర్తి చేశామని, నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నామని చెప్పారు.


మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందని తెలిపారు. తాము ఐజీ స్థాయి అధికారితో 'శక్తి యాప్' తెచ్చామని, దీనిని 1.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. లైంగిక నేరాల దర్యాప్తు నాణ్యత 31 శాతం నుంచి ఏకంగా 90 శాతానికి పెరిగిందని, 591 మందికి శిక్షలు పడ్డాయని వివరించారు.


'ఈగల్ టీమ్' ద్వారా నార్కోటిక్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని, ఏపీ మోడల్‌ను తెలంగాణ కూడా అనుసరిస్తుండడం మనకు గర్వకారణమన్నారు. ఇప్పటివరకు 2,366 గంజాయి కేసులు నమోదు చేసి, 986 మందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే సైబర్ క్రైమ్స్ కోసం ప్రత్యేక 'వార్ రూమ్' ఏర్పాటు చేస్తున్నామని, రూ. 247 కోట్ల సైబర్ ఫ్రాడ్ మనీని ఫ్రీజ్ చేయడంతో పాటు 8 వేలకు పైగా ఇల్లీగల్ ఆన్‌లైన్ కంటెంట్‌ను తొలగించామని స్పష్టం చేశారు.


Anitha
TDP
Disha

More Telugu News